కర్ణాటక విద్యాసంస్థల్లో విద్యార్థులు మతపరమైన ఎటువంటి వేషధారణలకు పాల్పడకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ గానీ.. కాషాయం గానీ ఎలాంటి అదనపు వస్త్ర ధారణను కోర్టు అనుమతించదని తదుపరి విచారణ వరకూ తమ ఆదేశాలు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఎవరూ కూడా స్కూల్, కాలేజీ యూనిఫామ్ తప్ప మరొకరకమైన వస్త్ర ధారణకు పూనుకోవద్దని స్పష్టం చేసింది.
హైకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టీస్ రితురా అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, మరియు జస్టిస్ జయం ఖాజీ ఆధ్వర్యంలోని ఫుల్ బెంచ్ ఈ విచారణ చేపట్టి..తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభించామని ఆదేశించి.. విద్యార్థులు కూడా ఎటువంటి ఆవేశాలకు, భావోద్వేగాలకు లోనుకాకుండా మతపరమైన భావనలకు చోటిచ్చే వస్త్రధారణ చేసుకోవద్దని కోరింది.
సోమవారం నాడు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ వివాదంపై సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ కర్ణాటక హైకోర్టులో వుంది కాబట్టి.. అక్కడ నిర్ణయం జరిగిన తర్వాత ఆలోచన చేస్తామని చెప్పింది.