5జీ నెట్వర్క్ కేసులో జూహీకి బిగ్ షాక్…రూ.20 లక్షల ఫైన్ విధించిన ఢిల్లీ హైకోర్ట్బాలీవుడ్ హీరోయిన్ జూహీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. 5జీ నెట్వర్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆమె దాఖలు చేసిన విషయం తెలిసిందే. పర్యవరణం దెబ్బతినడంతో పాటు, జీవరాశులపై రేడియేషన్ ప్రభావం అధికంగా ఉంటుందని, అందువల్ల దీన్ని బ్యాన్ చేసేలా ఆదేశాలివ్వాలంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు… 5జీ నెట్వర్క్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో.. కనీస రీసెర్చ్ ఆధారాలు కూడా సమర్పించలేదని అసహనం వ్యక్తం చేసింది.
పబ్లిసిటీ కోసం ఈ పిటిషన్ వేసినట్లుగా ఉందని భావించి, 20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదిలా వుంటే, జరిమానా విధించడానికి ఇదే కారణం కాదు. కోర్టు విచారణలన్నీ ప్రస్తుతం ఆన్ లైన్లో జరుగుతున్నాయి. విచారణ సందర్భంలో విచారణ లింక్ ని పిటీషనర్లకు పంపుతుంటారు. తాజాగా జూహీ వేసిన 5జీ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకు కూడా విచారణ లింక్ ని పంపించారు. అయితే జూహిచావ్లా తనకు అందిన విచారణ లింక్ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. ఆ లింక్ చూసిన వాళ్లందరూ.. ఓపెన్ చేయడం ప్రారంభించారు. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి జూహీ నటించిన హిందీ పాటలు పాడుతూ రెండు మూడు సార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. విచారణ లింక్ ని జూహీ ఇతరులకు షేర్ చేయడం వల్లే కోర్టు కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక ఆమెకు భారీ ఫైన్ విధించడానికి ఇదో కారణం కూడా.