ఒకనాటి తెలుగు అందాల తార, రాజకీయనాయకురాలు జయప్రద మళ్ళీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉంది. ఈ విషయాన్నే ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. సినీనటిగా ఉన్నప్పుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామరావు ప్రోత్సాహంతో ఆమె టీడీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
అనంతర కాలంలో పార్టీలో అంతర్గత కారణాలతో మనస్తాపం చెంది… జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో రాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. అప్పట్లో ఆమెకు సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ అండగా ఉన్నారు. తర్వాతి కాలంలో ఆమె పార్టీ నుండి బయటకు వచ్చి రాష్ట్రీయ్ లోక్ దళ్ పార్టీలో చేరారు. బిజ్నూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆమె కమల దళంలోనే కొనసాగుతున్నారు.
తాజాగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జయప్రద… తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించారు. ఇకపై తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో భాగం పంచుకోవాలనుకుంటున్నానని స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచిగానీ, తెలంగాణ నుంచిగానీ.. తాను రావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. అయినప్పటికీ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మొత్తానికి జయప్రద తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.