అడవి మనుషుల్లాగా పురుగులను తింటారా అని ఈ జనరేషన్ ఆశ్చర్యపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినవారు ఉసిళ్ల వేపుడు రుచి చూసే ఉంటారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో ఎర్రచీమల చట్నీ బాగా ఫేమస్. జార్ఖండ్ లోని కోడా ఆదివాసీలైతే ఆరేడు తరాలనుంచీ బెమౌట్ చీమలను ఆనందంగా లాగించేస్తుంటారు. నిజానికి, చీమలు ఎంతో బల వర్ధకమైన ఆహారమని అంటున్నారు బెంగళూరుకు చెందిన వంటకాల నిపుణులు.
కీటకాలను తినే అలవాటు తరాల నుంచీ ఉంది. ప్రజల్లో ఆధునికత పెరిగేకొద్దీ కొన్నికొన్ని ఆహారాలు, అలవాట్లు దూరం అవుతున్నాయి. తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివాటిని ఒకప్పుడు లొట్టలేసుకొని తినేవారట. మన పూర్వీకుల మెనూలో రెండు వేలకుపైగా కీటకాలుండేవి. ప్రస్తుతం, ఆ సంఖ్య ఐదొందలకు పడిపోయింది. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఖర్జూర పురుగుల లార్వా నుంచి అద్భుతమైన వంటకాన్ని చేస్తారు. అసోంలో ఎర్రచీమల లార్వాతోనూ పచ్చళ్లు పెడతారు. మన దేశంలో దాదాపు 10 రాష్ర్టాలలో 300 పైచిలుకు కీటకాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
చీమలు, ఇతర తినగలిగే కీటకాల వంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు నిపుణులు. బస్తర్ ఆదివాసీలు వండుకొనే చీమల చట్నీలో, ఈత పురుగుల కూరలో పోషక విలువలు అపారం. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి ఈ బలవర్ధక ఆహారం ఉపయోగపడుతుంది. ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ఆరగించే ‘చాప్ డా’ అనే చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. దీన్ని కార్పొరేట్ కంపెనీలు మార్కెట్లో అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నాయి.
ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. మనం నిరుపయోగంగా భావించే కీటకాలే ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించబోతున్నాయి. 2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్ 2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. కీటకాలతో రకరకాల వంటకాలను వండి వడ్డిస్తున్నారు చేయి తిరిగిన షెఫ్లు. మావెరిక్ అనే వంట నిపుణుడు అయితే, బతికున్న చీమలతో రుచికరమైన ఐస్క్రీమ్ తయారు చేస్తాడు. అమెరికాలో ఉప్పు మిడతల ప్రొటీన్ బార్లు చాలా పాపులర్. బొద్దింకల పాలతో చేసిన ఆహారాలు కూడా కొన్ని దేశాల్లో ప్రత్యేకం