చనిపోయిన తల్లి అంత్య క్రియల విషయంలో ఆమె కొడుకు, మనవరాలు మధ్య తగాదా పోలీసుల వరకు చేరింది. క్రైస్తవ మతం తీసుకున్న కొడుకు, హిందూ సంప్రదాయాన్నే అనుసరిస్తానన్న మనవరాలు.. వీరిద్దరి మధ్య గొడవలో చివరకు మనవరాలే గెలిచింది. గ్వాలియర్ లో సరోజా దేవి అనే ఓ మహిళ చనిపోయింది. ఆమె చనిపోవడానికి ముందే కొడుకు క్రైస్తవ మతం తీసుకుని డేవిడ్ గా పేరు మార్చుకున్నాడు. తన తల్లిని క్రైస్తవ శ్మశాన వాటికలోనే పూడ్చిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే మృతురాలి మనవరాలు శ్వేతా సుమన్ జార్ఖండ్ నుంచి వచ్చి అభ్యంతరం చెప్పింది. తన అమ్మమ్మ చివరి వరకు హిందూ సంప్రదాయాన్నే నమ్ముకుందని, కొడుకు క్రైస్తవ మతాన్ని తీసుకోవడాన్ని కూడా ఆమె వ్యతిరేకించిందని చెప్పింది. అందువల్ల హిందువుగానే చనిపోయిన అమ్మమ్మకు హిందూ సాంప్రదాయంలోనే అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, మనవరాలు వాదననే సమర్థించారు. శ్వేతా సుమన్ తన అమ్మమ్మ మృతదేహాన్ని ముక్తిధామం శ్మశాన వాటికకు తీసుకెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించింది.