ఆడపిల్ల పుట్టడమే కష్టం, నష్టం అనుకునే ఉత్తరాది రాష్ట్రాల్లో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంలో అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంది. ఆ కుటుంబంలో 35 ఏళ్ళుగా మగపిల్లలే పుడుతున్నారు. తమ వంశంలో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదన్న బాధ తీరిపోయింది. రాజస్థాన్ లో 35 ఏళ్ళుగా ఆడపిల్ల పుడుతుందని ఎదురుచూస్తున్న ఓ కుటుంబంలో కోడలుకి ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుటుంబం కోడలిని బిడ్డతో సహా తమ ఇంటికి తీసుకొచ్చేందుకు నాలుగున్నర లక్షల ఖర్చు పెట్టి హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకొచ్చింది.
రెండు హెలిప్యాడ్ లను కూడా కట్టించింది. నాగౌర్ జిల్లా చాంద్వాతా గ్రామానికి తమ మనవరాలిని ఇలా ఘనంగా ఆహ్వానించారు. మనవరాలికి రియా అనే పేరు పెట్టారు. ఊరంతా విందులు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా ఆ కుటుంబమే చేయించింది. ఊరంతా తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. తమ కుటుంబంలో 35 ఏళ్ళకు ఒక్క ఆడపిల్ల పుట్టిందన్న సంతోషం తమకు ఉందని మదన్ లాల్ కుమార్ చెప్పారు.
ఇందుకోసం తరతరాలుగా తాము పూజలు చేస్తూనే ఉన్నామని, ఎట్టకేలకు ఆ పూజలు ఫలించి ఆడపిల్ల పుట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి అదృష్టమని తల్లిదండ్రులను చూసుకునే గుణం ఆడపిల్లకే ఉంటుందని, అందువల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇలాగే పండగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ లో చాలా ప్రాంతాల్లో ఆడపిల్లను భారంగా భావిస్తారు. అలాంటిది మద్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినందుకు ఇలా సంబరాలు చేసుకోవడం సంతోషించదగ్గ విషయం.