హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లు కనిపించిన వీడియో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వీడియో ఫేక్ అని, తాను జిమ్లో ఎక్సర్ సైజులు చేస్తోన్న వీడియోను మార్ఫింగ్ చేశారని, దీనిపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని గోరంట్ల చెప్పుకొచ్చారు. అయితే దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని వేచి ఉన్నారు.
గతంలో వైసీపీ నాయకుల రాసలీలలు ఒక్కోక్కటి బయటకొచ్చాయి. సినీ నటుడు పృధ్వీరాజ్ .. ఆ తర్వాత అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు ఇలా ఒక్కొక్కరు బుక్ అయ్యారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. గతంలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా ఉన్న పృధ్వీరాజ్ ఓ మహిళతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ పెను సంచలనం సృష్టించింది. దీంతో ఆయనను పదవి నుంచి తప్పించారు. ఇదంతా తన ఓర్వలేక ఎవరో తనను ఇరికించారని, కుట్ర చేశారని మొత్తుకున్నాడు. అయినా పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంది.
ఆ తర్వాత మంత్రి అవంతి శ్రీనివాసరావు రాసలీలల ఆడియో టేపుల విషయం కలకలం రేపింది. నా మాట విని ఇంటికి రా.. ఓ అరగంటలో పంపిస్తా.. అంటూ లీకైన ఆడియో సంచలనం సృష్టించింది. అయితే దీనిపై .. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎవరో ఇలా ఇరికించారని అవంతి చెప్పుకొచ్చారు. ఈ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపినా.. సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక మంత్రి అంబటి రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.
ఇంటర్వూ కోసం మెసేజ్ చేసిన యూట్యూబ్ ఛానల్ యాంకర్ కి.. ఇంటర్వూ ఇస్తే నాకేం ఇస్తావ్ అంటూ రిప్లయ్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అదేకాకుండా ఓ మహిళతో హస్కీ వాయిస్ తో అంబటి మాట్లాడిన మాటలు గతంలో వైరల్ అయ్యాయి. పార్టీగానీ, సీఎంగానీ అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక జోగి రమేష్ కూడా మహిళా వాలంటీర్ తో అసభ్యంగా ప్రవర్తించారని, వేధించిన దాఖలాలు ఉన్నాయి. ఈయన మీద కూడా ఎలాంటి యాక్షన్ గానీ, రియాక్షన్ గానీ తీసుకోలేదు.
ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వ్యవహారం సంచలనం కలిగించింది. గతంలో అంబటి, అవంతి, జోగి రమేష్లపై ఎలాంటి చర్యలు తీసుకోని.. వైసీపీ హైకమాండ్ .. గోరంట్ల విషయంలో చర్యలు తీసుకుంటుందా అనేది అందరి మెదడుల్లో మెదులుతోన్న ప్రశ్న. గోరంట్ల మాధవ్ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని, కానీ ఆయన ఆ వీడియో ఫేక్ అని చెబుతున్నారని.. నిజానిజాలు తెలిసే వరకు వేచి చూస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.
ఇక డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా తిరుమల దర్శనం చేసుకున్న అనంతరం తిరుమల కొండపైనే ఈ అంశంపై మాట్లాడారు. గోరంట్ల చేసింది నిజమని తేలితే పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో అంబటి, అవంతివి ఆడియో టేపులు అయితే.. గోరంట్లది వీడియో. ఆడియో టేపుల్ని మార్ఫింగ్ చేయడం, మిమిక్రీ చేయడం సాధ్యమే అయినా.. వీడియోను మాత్రం ఇలా మార్ఫింగ్ చేయడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే గోరంట్ల రెడ్ హ్యాండెడ్ గా చిక్కుకుపోయాడు. కానీ గోరంట్ల మాత్రం .. ఇది ఫేక్ వీడియో అని ఘంటాపధంగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. వైసీపీ హైకమాండ్ గోరంట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.