ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న దశలో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కాసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. కనీసం 14 రోజులు ఆంక్షలు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Centre reviews #COVID19 status and preparedness in States/UTs, in view of #Omicron variant
States advised to be vigilant and Monitor Case Positivity, Doubling Rate, Clusters of New Cases across Districts
Read here: https://t.co/79PuhnTM78 #IndiaFightsCorona pic.twitter.com/ZNvQgQdxng
— PIB India (@PIB_India) December 23, 2021
రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలు..
– పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.
– పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలి.
– అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలి.
– ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.
– రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.
– వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలి. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.